Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతూ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. టీవీకే (TVK) పార్టీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, లొంగతీసుకునేందుకు కొందరు వ్యక్తులు తెరవెనుక పెద్ద ఎత్తున చక్రం తిప్పినట్లు ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంలో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కుట్ర వెనుక డీఎంకే మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ హస్తం ఉన్నట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో శాసనసభ స్పీకర్కు వ్యతిరేకంగా జరగబోయే ఓటింగ్లో అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల భారీ లంచం ఆఫర్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే (TVK) ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. ఇళయరాజాను కొందరు వ్యక్తులు ఫోన్ ద్వారా సంప్రదించి ఈ ఎర వేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఈ కేసు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.
అయితే, కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే ఇళయరాజాకు తిరునావుక్కరసు అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ‘ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్’ (IPDS) అనే సర్వే సంస్థను నడుపుతున్నానని, ఒక ముఖ్యమైన పార్టీకి చెందిన కొందరు నేతల తరఫున మాట్లాడుతున్నానని చెప్పాడు. అసెంబ్లీలో స్పీకర్కు వ్యతిరేకంగా తీర్మానం రానుందని, ఆ సమయంలో తమకు అనుకూలంగా ఓటు వేస్తే రూ.35 కోట్లు ఇస్తామని ఆశ చూపాడు. దీనికి ఎమ్మెల్యే నిరాకరించడమే కాకుండా, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తిరునావుక్కరసు.. ఈ విషయం బయటపెడితే ఎమ్మెల్యేను, ఆయన కుటుంబాన్ని మట్టుబెడతామని బెదిరించాడు. ఈ బెదిరింపులపై ఎమ్మెల్యే ఇళయరాజా జూన్ 29, 2026న చెన్నై పోలీస్ కమిషనర్ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు సమర్పించారు. దీని ఆధారంగా డీ1 త్రిప్లికేన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాల సాయంతో చెన్నై అరుంబాక్కానికి చెందిన తిరునావుక్కరసు, తిరుచ్చికి చెందిన నరేష్, మేడవాక్కానికి చెందిన త్యాగరాజన్లను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. డీఎంకే మాజీ మంత్రి, ప్రస్తుత కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే వి. సెంథిల్ బాలాజీ సోదరుడు వి. అశోక్ కుమార్.. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు నరేష్ను చెన్నైలో కలిసినట్లు పోలీసులు గుర్తించారు. సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకే తిరునావుక్కరసు రంగంలోకి దిగి ఎమ్మెల్యే ఇళయరాజాకు ఫోన్ చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు నిందితులను మరింత లోతుగా విచారిస్తున్నారు.

