Donald Trump: స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఒక వైపు కొనసాగుతుంటే, మరోవైపు ట్రంప్ ఇరాన్కు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. లెబనాన్లో ఇరాన్ ప్రాక్సీ హిజ్బుల్లాను వెంటనే ఆపాలని, లేదంటే గత వారం చేసినట్లే, ఈ సారి మరింత తీవ్రంగా ఇరాన్ను దెబ్బతీస్తామని హెచ్చరించారు. చర్చలు విఫలమైతే ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తామని, హార్ముజ్ను ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన ఈ పోస్ట్ చేశారు. ప్రాంతీయ భద్రత, హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, పలు రంగాలలో కాల్పుల విరమణలపై విస్తృత చర్చలు నడుస్తున్న సమయంలో ఈ హెచ్చరికలు రావడం గమనార్హం.
ప్రస్తుతం చర్చలు లెబనాన్పై ఇజ్రాయిల్ దాడుల పైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్, పాకిస్తాన్, ఖతార్లతో జరిగిన చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. లెబనాన్లో కాల్పుల విరమణ పరిరక్షించేందుకు ట్రంప్ ప్రభుత్వం పురోగతి సాధించిందని, అయితే పరిస్థితి ఇప్పటికీ సున్నితంగానే ఉందని చెప్పారు. విస్తృత ప్రాంతీయ సంధిని సాధించడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని, లెబనాన్ కాల్పుల విరమణ ఒక పరిష్కారం దిశగా కీలకమైన అడుగుగా భావిస్తున్నట్లు వాన్స్ చెప్పారు. అమెరికాను చిరాకు పరిచే విధానాలను ఇరాన్ విడిచిపెడితే, ఆ దేశంతో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
అయితే, ఇరాన్ షరతులు నెరవేరితే తప్పా, చర్చల తదుపరి దశకు వెళ్లేందుకు సిద్ధిగా లేదు. కీలకమైన చర్చల్లో అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలు, లెబనాన్పై ఇజ్రాయిల్ దాడుల్ని ఆపడం కీలకంగా మారాయి. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య దాడులు ఆపడంతో అమెరికా విఫలమైందని ఇరాన్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ప్రపంచ చమురుకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండటం చర్చల్ని సంక్లిష్టంగా మార్చాయి.

