Modi-Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఈరోజు(సోమవారం) ఫోన్లో మాట్లాడినట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ పోస్టులో ‘‘స్టే ట్యూన్డ్’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అయితే, ఇరువురు నేతలు ఏ విషయంపై మాట్లాడారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే, భారత్-అమెరికా మధ్య కీలక వాణజ్య ఒప్పందం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించిన తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో అనిశ్చితి ఏర్పడింది. కేంద్ర బడ్జెట్ 2026లో కూడా ఈ టారిఫ్లను ఎదుర్కొనే చర్యల్ని పొందుపరిచారు. భారత్ తన ఉత్పత్తుల కోసం ఇతర మార్కెట్లను చూసుకుంటోంది. ఇటీవల యురోపియన్ యూనియన్-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరింది. చివరిసారిగా డిసెంబర్ 2025లో ఇరువురు నేతలు మాట్లాడారు.
తాజాగా ప్రధాని మోడీ కూడా ఎక్స్లో స్పందిస్తూ.. ఈ చర్చ సానుకూలంగా సాగిందని అభివర్ణించారు. మరోవైపు రాయబారి ‘‘స్టే ట్యూన్డ్’’ అని వ్యాఖ్యలో రెండు దేశాల మధ్య కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా రాయబారి పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రధాని మోడీ ఫోటో ఉన్న పోస్టును షేర్ చేశారు. ఈ పోస్టులో ఎలాంటి వ్యాఖ్యలు లేకపోయినా, ఇండియా టుడే మ్యాగజైన్ ‘‘న్యూస్మేకర్స్ ఆఫ్ ఆ ఇయర్ 2025’’ కవర్ పేజీని షేర్ చేశారు. ఈ కవర్ పేజీపై మోడీ, ట్రంప్ ఫోటోలు ఉన్నాయి.
