Parliament Monsoon Session: దేశంలో ధరల పెరుగుదలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతోంది. నిత్యావసర ధరల పెరుగుదలపై లోక్సభలో చర్చ చేపట్టాలని కొద్దిరోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పక్షం ఈ అంశంపై చర్చించేందుకు అంగీకారం తెలిపింది. సోమవారం లోక్సభలో ధరల పెరుగుదలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ పచ్చి వంకాయ కొరికి చూపించారు. వంట గ్యాస్ ధరలను కేంద్రం వరుసబెట్టి పెంచుతున్న తీరును నిరసిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. సిలిండర్ ధర పెరగడంతో సామాన్యులు వంట చేసుకోవడం కష్టంగా మారిందని ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. రూ.600 ఉన్న సిలిండర్ ధరను రూ.1100 చేశారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ మండిపడ్డారు. ప్రజలు పచ్చికూరగాయలు తినాలని ప్రభుత్వం కోరుకుంటోందా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పచ్చి వంకాయ తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Also: Canada Supreme Court: కండోమ్ పెట్టిన చిచ్చు.. కోర్టుకీడ్చిన అమ్మాయి
మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . పెట్రోల్, డీజిల్ నుంచి గ్యాస్ సిలిండర్ సహా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంట్లో ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర గత 5 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 1, 2017న గృహాలలో ఉపయోగించే 14.2 కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.524గా ఉండేది. ఆగస్టు 1, 2018న దీని ధర రూ. 789.50కి పెరిగింది. ఆగస్టు 1, 2019న గ్యాస్ సిలిండర్ ధర రూ.574.5కి తగ్గింది. ఆగస్టు 1, 2020న గ్యాస్ సిలిండర్ ధర రూ.594గా నమోదైంది. జూలై 1, 2021న సిలిండర్ ధర రూ. 834.50కి పెరిగింది. జూలై 6, 2022న సిలిండర్ ధర 1,053కి చేరింది. అంటే ఏడాది వ్యవధిలోనే దీని ధర రూ.218.50 పెరిగిపోయింది.
#NDTVBeeps | Why A Trinamool MP Bit Into Brinjal In Parliament pic.twitter.com/A2Snj7wH25
— NDTV (@ndtv) August 1, 2022