Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. సోనార్పూర్లో పర్యటిస్తున్న సమయంలో ఎంపీ అభిషేక్ బెనర్జీపై ఒక్కసారిగా దాడి జరిగింది. పరిస్థితిని గమనించిన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. క్షణాల వ్యవధిలో అభిషేక్ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
“దొంగ.. దొంగ” అంటూ బీజేపీ నినాదాలు
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్పూర్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం కొందరు దాడి చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్న బెనర్జీపై రాళ్లు, గుడ్లు విసిరారు. అంతేకాకుండా, కొందరు వ్యక్తులు ఆయనపై చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించి, కాళ్లతో తన్నారు. పార్టీలో నంబర్ 2గా పరిగణించే ఆయనపై ఈ దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
ఇదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర నిరసనలకు దిగారు. ఆయనను ఉద్దేశించి “దొంగ.. దొంగ” (చోర్.. చోర్) అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ముట్టడించే ప్రయత్నం చేశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీపై నడిరోడ్డుపై దాడి జరగడం, అదే సమయంలో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించడంతో సోనార్పూర్లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ చర్యలతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. పశ్చిమ బెంగాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ ఘటనతో పొలిటికల్ వార్ మరింత ముదిరింది.
