Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో ఉంది. పార్టీ సుప్రీమో మమతా బెనర్జీ మాట కూడా ఎమ్మెల్యేలు వినడం లేదు. మరోవైపు, మమత నుంచి పార్టీని, పార్టీ గుర్తును చేజిక్కించుకునే ప్రయత్నాల్లో రెబల్ ఎమ్మెల్యేల ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పిలుపు ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. మంగళవారం కోల్కతాలో జరిగిన ధర్నాకు మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు కేవలం ఐదుగురే హాజరు కావడం సంచలంగా మారింది. రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ రెబల్ వర్గం దీదీకి ఎదురుతిరుగుతోంది.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీకి చెందిన అన్ని కమిటీలు, దాని అనుబంధ సంస్థల్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని టీఎంసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. పార్టీ అన్ని స్థాయిల్లో సమగ్రమైన ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత సమీక్ష ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పింది. దీని తర్వాత కమిటీలను పునర్నిర్మించి, తగిన సమయంలో ప్రకటిస్తామని చెప్పింది.
అయితే, అసెంబ్లీ ఎన్నికత తర్వాత టీఎంసీ అగ్రనాయకత్వంలో చీలిక ఏర్పడిందని తెలుస్తోంది. అనుబంధ సంస్థలు హైకమాండ్ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని కమిటీలను రద్దు చేసినట్లు తెలిసింది. టీఎంసీకి సుమారు 16 అనుబంధ సంస్థలు ఉన్నాయి. పార్టీలోని యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు మొదలైన వివిధ విభాగాలకు సంబంధించిన అనుబంధ విభాగాలు ఉ న్నాయి. ఇక కమిటీల విషయానికి వస్తే టీఎంసీకి ఒక ప్రధాన కార్యనిర్వాహక కమిటీ ఉంది. దీనికి తోడుగా కోర్ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా, బ్లాక్ కమిటీలు, క్రమశిక్షణా కమిటీ ఉన్నాయి. సంక్షోభం నేపథ్యంలో తృణమూల్ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
