ఉత్తరాఖండ్లో రెండు లైన్ల జాతీయ రహదారి (ఛార్ధామ్) ప్రాజెక్టులో భాగంగా రోడ్ల విస్తరణకు మంగళవారం సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఈ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు గల ప్రాముఖ్యతను తెలియజేస్తూ కేంద్రం వినిపించిన వాదనలను సుప్రీం కోర్టు ఏకీభవించింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది. అయితే ఈ ప్రాజెక్టులో సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read: బూస్టర్ డోస్..! కోవాగ్జిన్, కోవిషీల్డ్లో ఏది బెటర్..?
రక్షణ శాఖ చాలా ప్రత్యేకమైన శాఖ అని, తమకు అవసరమైన విధానాలను ఆ శాఖే రూపొందించుకోవచ్చునని కోర్టు తెలిపింది. సరిహద్దు భద్రతా సమస్యలపై రక్షణ మంత్రత్వశాఖ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పరచుకొని దాని ఆపరేషన్ అవసరాలను నిర్ణయించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇటీవలి కాలంలో జాతీయ భద్రతకు ఎదురవుతున్న తీవ్రమైన సవాళ్ల నేపథ్యంలో సరిహద్దు దళాలకి పరికరాల అవసరం ఉందని, భద్రత దళాల మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉందని కోర్టు వెల్లడించింది.