Petrol bomb hurled at BJP office in Coimbatore: తమిళనాడులో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. కోయంబత్తూర్ నగరంలో బీజేపీ ఆఫీసుపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు దుండగులు. గురువారం రాత్రి 8.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు న్యూ సిదాపుదూర్ లోని వీకే మీనన్ రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. అయితే పెట్రోల్ బాంబు పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. పెట్రోల్ బాంబుకు మంటలు అంటుకోకపోవడంతో అది పేలలేదు. కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో బాంబును దుండగులు విసిరేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
ఈ ఘటన జరిగిన వెంటనే నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమీషనర్ వి బాలకృష్ణన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు నిరసనగా గాంధీపురం జంక్షన్ లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఘటనకు కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఉగ్రవాదుల కుట్రే అని బీజేపీ ఆరోపించింది.
Read Also: Earthquake Indonesia: ఇండోనేషియాలో 4.7 తీవ్రతతో భారీ భూకంపం
తమిళనాడు వ్యాప్తంగా పీఎఫ్ఐ,ఎస్డీపీఐ సంస్థలపై గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మెరుపుదాడులు చేసింది. ఈ ఘటనను ఖండించారు కొంతమంది మైనారిటీ నేతలు. దీనికి వ్యతిరేకంగానే కోయంబత్తూర్ లో రెండు ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఒప్పనకర వీధిలోని ఓ వస్త్ర దుకాణంపై పెట్రోల్ బాంబు విసిరారు.. ఆ తరువాత బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.
ఇదిలా ఉంటే ఈ దాడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. కోయంబత్తూర్ కార్యాలయంపై దాడి మా కార్యకర్తలను భయపెట్టలేవని.. ఇది సమాజానికి, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనే మా సంకల్పాన్ని పెంచుతుందని.. ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు.