దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. మోర్బీలో నెలకొల్పిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘హనుమాన్జీ4ధామ్’ప్రాజెక్ట్ లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండోది. మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించారు.
సిమ్లాలోని జాఖూలో బిగ్-బి అమితాబ్ బచ్చన్ అల్లుడు నందా నిర్మించిన హనుమాన్ విగ్రహం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు పొందింది. జాఖూలోని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. దీని కోసం మొత్తం 1500 టన్నుల కాంక్రీట్, ఇనుము, రాళ్ళు ఉపయోగించారు.
విగ్రహం స్థిరంగా ఉండేందుకు 178 అడుగుల లోతుతో పునాది వేశారు. ఇక్కడ విగ్రహం ఏర్పాటుచేయడానికి కారణం కూడా వుంది. లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. అందుకే అంత భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రాంతం కూడా ఎత్తుగా వుండడంతో విగ్రహం కూడా బాగా పెద్దదిగా కనిపిస్తుంది.
