Tahawwur Rana: అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహావుర్ హుస్సేన్ రాణాను భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 10) అతను భారత్కు చేరుకుంటాడని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. తహావుర్ అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిపోవడంతో ఇండియాకు తీసుకొస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన రాణా ఈ కేసులో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. అయితే, 2008లో నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి సుమారు 166 మందిని చంపేశారు.
Read Also: Off The Record : నకిరేకల్ కారులో ఓవర్ లోడ్.. డ్రైవర్ సీటు కోసం తీవ్ర పోటీ
అయితే, అమెరికా తనను భారత్కు అప్పగించకుండా నిరోధించేందుకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయ మార్గాలనూ తహావుర్ రాణా వినియోగించుకున్నాడు. చివరగా తన అప్పగింతను ఆపాలంటూ యూఎస్ సుప్రీం కోర్టును కోరినప్పటికీ తిరస్కరించింది. కాగా, ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత 2009 అక్టోబరులో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ (FBI) చేతికి చిక్కి లాస్ ఏంజిల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధంలో ఉన్నాడు. 26/11 దాడికి కీలక సూత్రధారి అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్ మన్ హెడ్లీకి తహావుర్ రాణా సన్నిహితుడని సమాచారం. తహవుర్ రాణాను అమెరికా భారత్ కి అప్పగిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాడు.