Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..

  • పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
  • కారు, బైక్‌తో వెంబడించి మర్డర్..
  • దాడికి ముందే రెక్కీ, తప్పించుకునే మార్గాలను సిద్ధం చేసుకున్న దుండగులు..
West Bengal

West Bengal

Suvendu Adhikari PA Murder: ఎన్నికల అనంతరం బెంగాల్‌లో రక్తం పారుతూనే ఉంది. ప్రతీకార హత్యలు జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్ బీజేపీ నేత, సీఎం రేసులో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు(పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య సంచలనంగా మారింది. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నప్పటికీ, ముగ్గురు స్థానిక నేర చరిత్ర కలిగిన వ్యక్తుల్ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

అనేక సంవత్సరాలుగా సువేందు అధికారి పీఏగా చంద్రనాథ్ రథ్ పనిచేస్తున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. హత్యకు ముందు దుండగులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి, తప్పించుకునే మార్గాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. రథ్ స్కార్పియోను రెండు వాహనాలు వెంబడించాయి, వీటిలో ఒకటి WB74AX2270 రిజిస్ట్రేషన్ నంబరు గల వెండి రంగు శాంట్రో కారు కాగా, మరొకటి మోటార్‌సైకిల్. స్కార్పియోను ఓవర్ టేక్ చేసిన శాంట్రో స్కార్పియో వేగాన్ని తగ్గించేలా చేసింది. కొద్ది క్షణాలకే బైక్‌పై వచ్చిన దుండగులు అతి దగ్గర నుంచి రథ్‌పై కాల్పులు జరిపారు.

Read Also: Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

ఈ దాడిలో రథ్ పొట్ట, ఛాతీ, తల భాగాల్లో బుల్లెట్లు తగిలాయి. దాడికి ఉపయోగించిన బైక్‌కు నెంబర్ ప్లేట్ లేదని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి ఆస్ట్రియాలో జరిగిన గ్లాస్ పిస్టల్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. కారు నెంబర్ ప్లేట్ మార్చినట్లు, ఇంజన్ ఛాసిస్ నెంబర్ లేకుండా చేసినట్లు తెలుస్తోంది.

ఈ హత్యపై బీజేపీ, టీఎంసీపై విరుచుకుపడుతోంది. మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ హత్య చేయించినట్లు బీజేపీ ఆరోపించింది. తాము అధికారంలో లేకున్నా హత్యలు జరుగుతాయనే సందేశాన్ని పంపాలని ఇలా చేశారని బీజేపీ నేత అర్జున్ సింగ్ ఆరోపించారు. మరోవైపు టీఎంసీ ఈ హత్యను ఖండించింది. తమపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిగాలని డిమాండ్ చేసింది.