1973 Plane Hijacking: నేపాల్లో ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. చివరకు యువత నిరసనలకు ఓలీ తలొగ్గి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు, నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరు అవుతారు.? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, మాజీ నేపాల్ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఈమె భర్త 52 ఏళ్ల క్రితం విమానం హైజాక్కు పాల్పడినట్లు చాలా తక్కువ మందికి తెలుసు. 1973 విమాన హైజాకింగ్లో కర్కీ భర్త , నేపాలీ కాంగ్రెస్ మాజీ యువ నేత దుర్గా ప్రసాద్ సుబేది కీలకంగా వ్యవహరించారు.
కర్కీ వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే దుర్గా ప్రసాద్ సుబేదితో వివాహం జరిగింది. జూన్ 10, 1973లో నేపాల్లో జరిగిన మొదటి విమాన హైజాక్లో సుబేది పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విమానంలో హిందీ సిని నటి మాలా సిన్హా కూడా ఉన్నారు. సుబేదితో పాటు నాగేంద్ర ధుంగెల్, బసంత భట్టారాయ్ ముగ్గురూ కలిసి ఈ హైజాక్కి పాల్పడ్డారు.
Read Also: UP: తన ప్రైవేట్ పార్టును తానే కోసుకున్న యూపీఎస్సీ విద్యార్థి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
రాచరికానికి వ్యతిరేకంగా హైజాక్:
నేపాల్ రాజు మహేంద్ర పాలనలోని రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం కోసం నిధులు సేకరించడానికి ఈ హైజాకింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ హైజాకింగ్కు మాస్టర్ మైండ్గా గిరిజా ప్రసాద్ కోయిరాలా ఉన్నారు. ఆ తర్వాత, ఈయన నేపాల్కు 4 సార్లు ప్రధానిగా పనిచేశారు. నేపాల్ రాయబార కార్యాలయాన్ని ఉటంకిస్తూ, న్యూయార్స్ టైమ్స్ జూన్ 11, 1973న ఒక నివేదికను వెలుగులోకి తెచ్చింది. ట్విన్ ఇంజన్ కలిగిన నేపాలీ విమానాన్ని హైజాక్ చేసి, భారత్ లోని ఫోర్బుస్ గంజ్ వద్ద ల్యాండ్ చేశారు. దాదాపుగా 4 లక్షల డాలర్లతో అడవిలోకి పారిపోయారని పేర్కొంది. ఈ డబ్బు నేపాల్ స్టేట్ బ్యాంక్కు చెందింది. నేపాల్ లోని బిరత్ నగర్ నుంచి రాజధాని ఖాట్మాండుకు ఒక సాధారణ విమానంలో రవాణా చేస్తున్నప్పుడు హైజాక్ జరిగింది. పైలట్కు తుపాకీ చూపించి హైజాక్ చేశారు.
ఈ డబ్బు తమ పార్టీ సంపూర్ణ రాచరికానికి వ్యతిరేకంగా ప్రారంభించిన పోరాటానికి ఉద్దేశించబడినది అని నేపాలీ మాజీ రాయబారి దినేష్ భట్టారాయ్ 2014లో రాయిటర్స్తో చెప్పారు. హైజాకర్లు పైలట్ను బీహార్లోని ఫోర్సుస్గంజ్ లో బలవంతంగా ల్యాండ్ చేయించారు. అప్పటికే అక్కడ మరో ఐదుగురు కుట్రదారులు వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నవారిలో నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కోయిరాలా ఉన్నారని, హైజాక్లో పాలుపంచుకున్నారని అనుమానంతో భారత జైలులో 3 ఏళ్లు ఉన్నారని రాయిటర్స్ నివేదించింది.
హైజాకర్లు విమానంలోని మూడు పెట్టెల నగదును దొంగిలించారు. ఒక ఏడాదిలోపు హైజాకర్లలో ధుంగెల్ మినహా అందర్ని భారత అధికారులు అరెస్ట్ చేశారు. దుబేది, ఇతరులు రెండేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. 1980లో ప్రజాభిప్రాయం సేకరణ కోసం నేపాల్కు తిరిగి వెళ్లారు.