Supreme Court: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తన వాదనల్ని వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పారదర్శకమైన దర్యాప్తు జరిగేలా చూసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలియజేశారు.
ఇదిలా ఉంటే, సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్లో అనుభవం ఉన్న చార్టర్ట్ అకౌంటెంట్ను సభ్యులుగా చేర్చిన కొత్త సిట్ ఏర్పాటు చేయాలని యూపీ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్త సిట్కు లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్. నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా అయోధ్య రేంజ్ డీఐజీ సోమెన్ బర్మా, అయోధ్య ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ ఉన్నారు. కోర్టు సూచన మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణుడైన చార్టర్డ్ అకౌంటెంట్ను కూడా సిట్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉన్నందున ఆర్థిక అంశాలను పరిశీలించేందుకు నిపుణులు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా పిటిషన్ల తరుపు న్యాయవాది, ఆలయానికి వచ్చే నిధులు, విరాళాల వివరాలను ట్రస్ట్ వెబ్ సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. అయితే, ఈ అంశాన్ని అనవసరంగా సంచలనంగా మార్చొద్దని సొలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తుపై రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

