మహిళలకు రుతుక్రమ సెలవులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రుతుక్రమం సమయంలో విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
రుతుక్రమం సమయంలో మహిళలకు తప్పనిసరి సెలవు మంజూరు అయ్యేలా ఆదేశాలు జారీ చేస్తే.. భవిష్యత్లో ‘‘వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.’’ అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. శ్రామిక మహిళల్లో పురుషుల కంటే తక్కువ అనే మాసినక భయంతో పాటు అభిప్రాయం కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. అవగాహన కల్పించడం, సున్నితత్వాన్ని కలిగించడం వేరు.. అంతేకాని రుతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం తెస్తే మాత్రం యాజమాన్యాలు మహిళలను నియమించుకోవడం మానేస్తారని పిటిషనరైన న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠిని హెచ్చరిస్తూ పిటిషన్ను తోసిపుచ్చారు.
ఒకవేళ ఉద్యోగ సమయాల్లో రుతుక్రమం అనే విషయం తెలిసినా కూడా ‘చెడు’గా ఫోకస్ అవుతుందని.. స్త్రీలను తక్కువ చేసి మాట్లాడతారని సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. దీనికి సీనియర్ న్యాయవాది ఎంఆర్. షంషాద్ జోక్యం చేసుకుని.. 2013లో కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని మహిళా విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రైవేట్ కంపెనీలు కూడా ఇలాంటి సడలింపులు కూడా ఇచ్చాయని షంషాద్ ప్రస్తావించారు. షంషాద్ వ్యాఖ్యలకు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ బదులిస్తూ.. ఆ చర్యలన్నీ కూడా స్వచ్ఛంద చర్యలు అని పేర్కొన్నారు. స్వచ్ఛందం వేరు.. చట్టం వేరు. ఒకవేళ చట్టంలో తప్పనిసరి అని ఆదేశాలిస్తే మాత్రం.. మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడమే మానేస్తారని పేర్కొన్నారు. దీంతో శ్రామిక మహిళల కెరీర్ ముగుస్తుందని.. అంతేకాకుండా వాళ్లంతా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందని సూర్యకాంత్ తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Dubai-Iran: దుబాయ్ ఆర్థిక భవనంపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే జనవరిలో రుతు పరిశుభ్రతపై సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. దీనిని ‘‘ఆడపిల్లల జీవించే హక్కు, గౌరవం, ఆరోగ్యం, విద్యలో అంతర్భాగం.’’గా పేర్కొంది. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం బాలికలు- మహిళల ఆరోగ్య హక్కును పరిరక్షించడానికి ప్రభుత్వాలు సానుకూల బాధ్యతను కలిగి ఉన్నాయని జస్టిస్ జెబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఉచిత శానిటరీ న్యాప్కిన్లు, ప్రత్యేక టాయిలెట్లు, ఋతు ఆరోగ్య అవగాహన ప్రచారాలను చేయాలని కోర్టు అన్ని ప్రభుత్వాలకు తప్పనిసరి ఆదేశాలు జారీ చేసింది.