సాధారణంగా ఏదైనా ప్రమాదంలో వ్యక్తి చనిపోతే అతని భార్య లేదా పిల్లలకు, లేదా తల్లిదండ్రులకు పరిహారం పొందే హక్కు వుంటుంది. అయితే అల్లుడి దగ్గర అత్త నివాసం ఉంటే మాత్రం ఆమెకు కూడా నష్టపరిహారం పొందేందుకు అర్హురాలేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త కూడా అతనికి చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందడానికి ఆమె అర్హురాలేనని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం ఈ విషయమై తీర్పు ఇచ్చింది. అల్లుడు-కూతురి వద్ద అత్త ఉండడం మామూలే. వృద్ధాప్యంలో పోషణ నిమిత్తం అల్లుడి పైన ఆధారపడుతుంటారు. అల్లునికి అత్త చట్టబద్ధమైన వారసురాలేమీ కాదు. కానీ ఆయన మరణించినప్పుడు ఆమె జీవనానికి ఇబ్బంది అవుతుంది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 ప్రకారం ఆమె చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుందని సుప్రీం తెలిపింది.,
ఈ విషయంలో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని కుటుంబానికి రూ.74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రైబ్యులన్ పరిహారాన్ని రూ. 48,39,728కు తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని. తెలిపింది. దీనిపై మృతుని భార్య సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
మృతుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ నెలకు రూ.83,831 జీతం పొందిన విషయాన్ని ధర్మాసనం పరిశీలించింది. అతను మరణించడం వల్ల ఆ కుటుంబం నష్టపోయిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు పరిహారాన్ని పెంచి.. 85,81,815 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి పరిహారం చెల్లించే తేదీ వరకు 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని సూచించింది. అల్లునిపై ఆధారపడ్డ అత్త కూడా పరిహారానికి అర్హురాలేనని పేర్కొంది. ఈ తీర్పు అల్లుడిపైన ఆధారపడ్డ అత్తలకు ఉపశమనంగా భావించాలి.