Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..

  • డీలిమిటేషన్ బిల్లుపై సంజయ్ రౌత్ యూటర్న్..
  • మార్పులు చేస్తే మద్దతు ఇస్తామని ప్రకటన..
  • 360 ఎంపీల మద్దతకు మరో 3 అడుగుల దూరంలో ఎన్డీయే సర్కార్..
Sanjay Raut

Sanjay Raut

Delimitation Bill: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపచేసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. వర్షాకాల సమావేశాల్లో సభ ముందుకు ఈ బిల్లును మరోసారి తీసుకురాబోతోంది. మెజారిటీ మార్క్ సాధించేందుకు ప్రతిపక్ష ఎంపీల మద్దతు కూడగడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు.

గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని, అయితే తాము సూచించిన సవరణలు చేస్తే దానికి మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు ముందు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచే విధంగా మార్పులు చేపడితే తాము మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు.

జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 131 రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలని చూస్తోంది. ప్రస్తుతం శివసేన యూబీటీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం 9 మంది ఎంపీలను గెలిపించుకుంది. ఇటీవల ఆరుగురు ఉద్ధవ్ పార్టీ నుంచి షిండే శివసేన పార్టీలో చేరారు.

మూడింట రెండు వంతుల మెజారిటికీ 3 ఓట్లు కావాలి:

గత లోక్‌సభ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే దానికి అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. దీనికి 540 మంది ఎంపీల్లో 360 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం టీఎంసీ రెబల్ ఎంపీలు 20 మంది, ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి శివసేనలోకి ఫిరాయించిన 6 మంది, ఎన్సీపీ-శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన 8 మంది మద్దతు ఉంది. మొత్తం సంఖ్య 332కు చేరింది. డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు మద్దతు ఇస్తే 354 మంది ఎంపీలకు సంఖ్య చేరుతుంది. మరో ఆరుగురు ఎంపీలు మాత్రమే అవసరం అవుతారు. ఇప్పుడు శివసేన యూబీటీకి చెందిన ముగ్గురు ఎంపీలు మద్దతు ఇస్తే మరో ముగ్గురు ఎంపీలు మద్దతు బీజేపీ సర్కార్‌కు అవసరం అవుతారు.