Sheikh Hasina: భారత్లోని న్యూఢిల్లీలో నిర్వహించిన ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా కార్యక్రమంలో మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వర్చువల్గా పాల్గొన్నారు. ఆగస్టు 2024లో బంగ్లా విద్యార్థి ఉద్యమం తర్వాత భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. అయితే, రెండేళ్ల తర్వాత షేక్ హసీనా తొలిసారి మౌనం వీడారు. బంగ్లాదేశ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
షేక్ హసీనాపై బంగ్లాదేశ్ తీవ్ర వ్యాఖ్యలు:
ఇదిలా ఉంటే, షేక్ హసీనా మాట్లాడటానికి అనుమతి ఇవ్వడంపై బంగ్లాదేశ్ భారత్పై విమర్శలు గుప్పిస్తోంది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, హసీనాను “దోషిగా తేలిన నరహంతకురాలు” (Convicted Genocider), “సామూహిక హత్యలకు పాల్పడిన నేరస్తురాలు” (Convicted Mass Murderer)గా అభివర్ణించింది. ఇలాంటి వ్యక్తికి భారత భూభాగం మీడియాతో మాట్లాడే అవకాశం కల్పించడం తమ దేశ సార్వభౌమత్వాన్ని అవమానించడమే అని ఆరోపించింది.
తన స్పీచ్లో హసీనా చేసిన వ్యాఖ్యల్ని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి నమోదు చేసిన మరణాల వివరాలను ప్రశ్నించడం, చరిత్రను వక్రీకరించడమే అవుతుందని ఆరోపించింది. భారత్కు ఇప్పటికే ఈ కార్యక్రమం వల్ల ద్వైపాక్షి సంబంధాలపై ప్రభావం ఉంటుందని హెచ్చరించినప్పటికీ కార్యక్రమం జరగడం విచారకరమని పేర్కొంది. ఇదే కాకుండా 2013లో రెండు దేశాల మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ప్రకారం హసీనాను అప్పగించాలని కోరినా, భారత్ నుంచి స్పందన రాలేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
షేక్ హసీనా ఏం మాట్లాడారంటే..
షేక్ హసీనా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ తాము నిర్మించిన బంగ్లాదేశ్ కాదని అన్నారు. బంగ్లాదేశ్లో అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు. ఇదే కాకుండా, తనను గద్దె దించేందుకు కుట్ర జరిగిందని, నిజమైన విద్యార్థి ఉద్యమం కాదని, అది పాలనను మార్చే(రెజిమ్ ఛేంజ్) కుట్ర అని అన్నారు. అల్లర్ల సమయంలో పోలీసులపై భారీ దాడులు జరిగాయని, వేలాది మంది పోలీసు సిబ్బంది హతమయ్యారని, దాడులకు గురయ్యారని, వందలాది పోలీస్ స్టేషన్లు ధ్వంసమయ్యాయని ఆమె పేర్కొన్నారు. జైలులో ఉన్న నేరస్తులకు మహ్మద్ యూనస్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని హసీనా అన్నారు. తనపై నమోదైన కేసులు కక్షలో భాగమే అని, త్వరలోనే తన ప్రజల వద్దకు వెళ్లేందుకు బంగ్లాదేశ్ వెళ్తానని చెప్పారు.

