Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మమతా బెనర్జీ అంటే ఎంతో విధేయత చూపించిన వారు కూడా ఇప్పుడు ఆమెకు దూరంగా వెళ్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), మమతకు వీరవిధేయురాలుగా గుర్తింపు పొందిన సాయోని ఘోష్ కూడా రెబల్ వర్గంలోకి వెళ్తోంది. జాదవ్ పూర్ ఎంపీ సయోనీ ఒకానొక సమయంలో మమతా బెనర్జీ ప్రధాని కావడం ఖాయం అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు, ఆమె కాకొలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని టీఎంసీ రెబల్ వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తిరుగుబాటు టీఎంసీ వర్గానికి మద్దతు తెలిపుతూ సాయోనీ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కోల్కతాలో కాకుండా ఢిల్లీలో ఉన్నారని సమాచారం. తిరుగుబాటు ఎంపీలంతా అక్కడే సమావేశమవుతున్నారు.
సాయోని ఘోష్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన ఈమె, మమతా బెనర్జీకి నమ్మినబంటుగా వ్యవహరించేవారు. మమత ప్రధాని అవుతారంటూ ఎన్నో సార్లు పొగడ్తలు కురిపించిన ఆమె, బెంగాల్లో తృణమూల్ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. తాను ఎన్నటికి మమతను విడిచిపెట్టేది లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సాయోని ఘోష్, ఇప్పుడు మమతకు పెద్ద దెబ్బేసింది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర ఓటమి తర్వాత కూడా, సాయోనీ బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఓట్ల దొపిడీకి పాల్పడిందని ఆరోపించారు. మేము ఓడిపోలేదు, ఓట్ల దొంగతనం జరిగిందని అన్నారు. 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు బీజేపీకి తగిన సమాధానం చెబుతారని విమర్శించింది. ఇలా కామెంట్స్ చేసిన నెల రోజులకే మమతా బెనర్జీకి బిగ్ షాక్ ఇచ్చింది.

