BJP: విధేయతకు, సామాన్య కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ మరోసారి నిరూపించింది. 28 ఏళ్ల పాటు బీజేపీ ఆఫీస్లో ప్యూన్గా పనిచేసిన వ్యక్తికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. గుజరాత్లోని మెహసానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా మెహసానా జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్యూన్గా పనిచేస్తున్న అంకితభావం గల ఉద్యోగి రమేష్ భిల్కు టికెట్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
రమేష్ భిల్ శనివారం అధికారికంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన 13వ వార్డుకు పార్టీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా మారారు. 10వ తరగతి వరకు చదువుకున్న రమేష్, 28 ఏళ్లుగా పార్టీ కార్యాలయంలో పనిచేయడం, అక్కడికి వచ్చే సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు టీ, నీరు అందిస్తూ ఉన్నారు. ఆయనకు ఉన్న విధేయత, క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఆయనకున్న పరిచయం కారణంగా పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఇప్పటి వరకు నా పార్టీ కార్యలయం కోసం పనిచేశానని, ఇప్పటి నుంచి తన వార్డ్ ప్రజల బాగోగుల కోసం పనిచేస్తానని రమేష్ భిల్ చెప్పారు.