Parliament Monsoon Session: ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు చేసిన నినాదాలు, గందరగోళం మధ్య ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. తక్షణమే చర్చకు ప్రతిపక్షాలు లేవనెత్తడంతో ఎగువ సభ ఎలాంటి కార్యకలాపాలు లేకుండా వాయిదా పడింది. ప్రఖ్యాత మాజీ ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ పీటీ ఉష రాజ్యసభ ఎంపీగా రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేశారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్ బయట సైతం విపక్షాల నిరసనలు కొనసాగాయి. ఈ క్రమంలో రాజ్యసభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది. లోక్సభలోనూ నిరసనలు హోరెత్తడం వల్ల.. సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభను వాయిదా వేసే ముందు.. ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహించేది చర్చల కోసమేకానీ, నినాదాల కోసం కాదని హితవు పలికారు.
‘ప్రజలు సభల నుంచి చర్చలు ఆశిస్తున్నారన్నారు. సభ్యులు గొడవ చేస్తూ సభ పరువు తీస్తున్నారు. రచ్చ చేస్తున్న సభ్యుల తీరు పార్లమెంటరీ సంప్రదాయాలకు భంగం కలిగిస్తోంది. అంశాల వారీ చర్చల కోసం నిబంధనల ప్రకారం సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. జీరో అవర్లో ఏదైనా అంశాన్ని లేవనెత్తడానికి అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. సభలో ఆందోళన చేయడానికి, అలజడి సృష్టించడాన్ని అనుమతించను. సభ్యులు సీటులోకి వెళ్తే మాట్లాడే అవకాశం ఇస్తా’ అని స్పీకర్ పేర్కొన్నారు. అయితే, సభ్యులు తమ ఆందోళనపై వెనక్కి తగ్గలేదు. దీంతో సభ వాయిదా వేయక తప్పలేదు.మరోవైపు, పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం ముందు బ్యానర్లు ప్రదర్శిస్తూ బైఠాయించారు.
PT Usha: రాజ్యసభ ఎంపీగా పీటీ ఉష ప్రమాణస్వీకారం
ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ప్రతిపక్షాలు పదేపదే వాయిదా వేయడంపై, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బుధవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు, రాజకీయంగా పనికిరాని వయనాడ్ ఎంపీ ఇప్పుడు పార్టీని గద్దె దించేందుకు నరకయాతన పడుతున్నారని అన్నారు. ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చించేందుకు బుధవారం ఉదయం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా నోటీసు ఇచ్చారు.