రాజస్థాన్లో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ గురువు అత్యంత నీచానికి ఒడిగట్టింది. రూ. 500 నోటు కోసం అమ్మాయిల బట్టలు విప్పి సోదా చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లలు అవమానంతో తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి చెందిన రూ.500 నోటు కనిపించలేదు. అయితే ఎవరి తీశారో చెప్పాలని హుకుం జారీ చేసింది. లేకపోతే బట్టలు విప్పాలని ఒత్తిడి చేసింది. సమాచారం ప్రకారం.. సీనియర్ టీచర్ సరస్వతి మీనా తరగతి గదిలో ఉంచిన రూ.500 నోటు కనిపించకుండా పోయింది. దీంతో ఆమె విద్యార్థినులపైనే అనుమానం వ్యక్తం చేశారు. రూ.500 తీసింది ఎవరో తెలుసుకోవడానికి విద్యార్థినులు బట్టలు విప్పాలని ఒత్తిడి చేసింది. అంతేకాకుండా ఎవరైనా బట్టలు విప్పేందుకు నిరాకరిస్తే వెంటనే రూ.500 చెల్లించాలని కూడా బెదిరించినట్లు బాధితులు తెలిపారు.
ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ పాఠశాల ప్రధాన గేటు ఎదుట ధర్నాకు దిగారు. విద్యార్థులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సవాయ్ మాధోపూర్ జిల్లా విద్యాశాఖ అధికారి విషయాన్ని భరత్పూర్ స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన అధికారులు సీనియర్ టీచర్ సరస్వతి మీనాను తక్షణమే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమెను ధోల్పూర్ జిల్లా రాజాఖెడా చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఈ ఘటనలో ఇతర ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందా అనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

