రాజా రఘువంశీ-సోనమ్కు మే 11న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వివాహం జరిగిందని.. ఆ సమయంలో అంతా సాధారణంగానే ఉందని రాజా సోదరుడు సచిన్ తెలిపారు. పెళ్లికి ముందు కూడా సోనమ్ కుటుంబంతో కలిసే షాపింగ్ చేసినట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదని సచిన్ పేర్కొన్నారు. మే 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారని.. 23 నుంచి ఆచూకీ లభించలేదన్నారు. జూన్ 2న రాజా మృతదేహం లభించిందని.. పచ్చబొట్టు ద్వారా డెడ్బాడీని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. అసలు రాజాను ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. సోనమ్ సజీవంగా కనిపించింది.. రాజాను చంపిన వ్యక్తులెవరో తెలియాల్సి ఉందని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: 11 ఏళ్లలో భారత్ వేగంగా వృద్ధిని సాధిస్తుంది..
టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రాజా-సోనమ్తో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారని టూరిస్ గైడ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. అయితే పోలీసులు వెంటాడుతున్నారన్న సమాచారంతో సోనమ్ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు సమాచారం. దీంతోనే సోనమ్ ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఒక ధాబా దగ్గర అపస్మారక స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను చికిత్స కోసం ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అనంతరం ఆమె పోలీసుల ముందు లొంగిపోయింది. అనంతరం మేఘాలయ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సోనమ్ ప్రియుడి కోసం గాలిస్తున్నారు. సోనమ్ను మేఘాలయ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇది కూడా చదవండి: Sonali Bendre : క్యాన్సర్ నుండి కోలుకోవడానికి కారణం ఆ హీరో ఇచ్చిన ధైర్యం..
అయితే పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. సోనమ్.. రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా గుర్తించారు. అతనితో కలిసి భర్తను చంపేందుకు కుట్ర పన్నిందని పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం రాజ్ కుష్వాహా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. హనీమూన్ ముసుగులో భర్తను చంపేందుకు ప్లాన్ చేసిందని గుర్తించారు. అయితే హనీమూన్కు వచ్చేటప్పుడే కాంట్రాక్ట్ కిల్లర్లను మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. జంట చివరిసారిగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో కనిపించారని ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ కుట్రను ఛేదించారు. ప్రస్తుతం సోనమ్.. ముగ్గురు హంతకులను అరెస్ట్ చేయగా.. సోనమ్ ప్రియుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్కు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో జంట విహరించారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకుని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. బాడీని చూసి హత్యకు పరిగణించారు. అయితే సోనమ్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపుమరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. యూపీలో సోనమ్ ప్రత్యక్షం కావడంతో దాదాపు 16 రోజుల సస్పెన్స్కు తెరపడింది.
తండ్రి ఖండన
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు. తన కుమార్తె నిర్దోషి అని, ఆమెను పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. భర్తను చంపే దుర్మా్ర్గురాలు కాదన్నారు. రెండు కుటుంబాల సమ్మతితోనే ఇద్దరికి వివాహం జరిపించినట్లు తెలిపారు. మేఘాలయ ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందని ఆయన అన్నారు. సోనమ్తో ఇంకా మాట్లాడలేదని.. అయినా ఆమె భర్తను ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు. కేవలం పోలీసులే కట్టుకథలు అల్లుతున్నారన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, హోంమంత్రి అమిత్ షాలను సంప్రదిస్తామని పేర్కొన్నారు. విచారణ జరిగితే మేఘాలయ పోలీసులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
What is happening to our society?#SonamRaghuvanshi hired killer to kill husband – Police
10 May – Marriage
23 May – Couple Missed
2 June – Body found of #Raja
9 June- Sonam arrested#rajaraghuvanshi #IndoreCouple #indorecouplemissing pic.twitter.com/H5jMvpoKVv— Pramod kumar yadav (@JournOOO) June 9, 2025