Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ

  • ముస్లింలకు మద్దతు నిలిచే విషయంలో భయపడొద్దు..
  • మైనారిటీల గొంతు వినిపించాలి..
  • మైనారిటీ సమావేశంలో రాహుల్ గాంధీ..
Rahulgandhi

Rahulgandhi

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతు ఇచ్చే విషయంలో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మైనారిటీ సలహా కమిటీ సమావేశంలో తమ అధినేత ముందు పలువురు నేతలు ఆందోళనల్ని వ్యక్తపరిచారు. రాహుల్ గాంధీ తమ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ముస్లింలకు మద్దతు నిలిచే విషయంలో భయపడొద్దని సూచించారు. ఇదే సమయంలో వచ్చే ఏడాదిలోగా ప్రధాని నరేంద్రమోడీ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక అసంతృప్తి, అంతర్జాతీయ పరిస్థితులు మోడీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంచనా వేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు కేవలం బీజేపీని ఓడించడానికి మాత్రమే కాంగ్రెస్‌కు ఓటు వేస్తారే అభిప్రాయాన్ని పార్టీ మార్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమాజం కోసం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇది పార్టీకి మద్దతు పెంచుతుందని చెప్పారు. ఇదే సమయంలో మరికొందరు నేతలు, మైనారిటీ సమస్యలపై ఇతర సీనియర్ నేతలు మాట్లాడేందుకు వెనుకంజ వేస్తున్నారని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో కొంత మంది నేతలు ‘‘ముస్లిం’’ అనే పదానికి బదులుగా ‘‘మైనారిటీ’’ అనే పదాన్ని ఉపయోగించాలని కోరారు. దీనితో రాహుల్ గాంధీ విభేదిస్తూ.. భయపడాల్సిన అవసరం లేదని, అన్యాయాన్ని ఎదుర్కొంటున్న ఏ సమాజానికైనా బహిరంగ మద్దతు ఇవ్వాలని అన్నారు. హిందువులు, దళితులు, అగ్రవర్ణాలు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు,జైనులు ఎవరైనా సరే కాంగ్రెస్ అందరి హక్కుల కోసం మాట్లాడుతుందని ఆయన చెప్పారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.