Rahul Gandhi: మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ వ్యాఖ్యలపై ఆయన నుంచి వివరాలు కోరుతున్నారు పోలీసులు. ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీస్ టీం తుగ్లక్ లేన్ లో ఉన్న రాహుల్ ఇంటికి వెళ్లింది.
Read Also: Revanth Reddy : అన్నదాతకు అండగా నిలవండి.. కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ లేఖ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న క్రమంలో కాశ్మీర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో మహిళలపై లైంగికదాడుల అంశాన్ని ప్రస్తావించారు. యాత్రలో భాగంగా తనను కొంతమంది మహిళలు కలిశారని, ఇప్పటికీ తాము లైంగికదాడులు ఎదుర్కొంటామని చెప్పారని అన్నారు. అయితే ఆ బాధితులెవరో తమకు చెప్పాలని కావాల్సిన భద్రత ఇస్తామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
ఈ అంశంపై రాహుల్ గాంధీ స్పందించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సుదీర్ఘ యాత్ర అని, బాధితుల వివరాలు ఇవ్వడానికి తనకు సమయం కావాలని రాహుల్ గాంధీ కోరినట్లు సాగర్ ప్రీత్ హుడా అన్నారు. ఈ వేధింపుల బారిన పడిని ఢిల్లీ మహిళలు ఎవరైనా ఉన్నారా అనేది తమకు ముఖ్యం అని, మైనర్ బాధితులు కూడా ఉండవచ్చని ఆయన అన్నారు. మార్చి 15న కూడా రాహుల్ గాంధీని కలవడానికి వచ్చామని అయితే ఆ సమయంలో కలవలేకపోయామని, మార్చి 16న వచ్చి, ఈ రోజు వస్తామని నోటీసు ఇచ్చామన్నారు.