NTV Telugu Site icon

Delhi: రాహుల్‌గాంధీతో వినేష్ ఫోగట్ భేటీ.. కాంగ్రెస్ టికెట్ ఖాయమా?

Vineshphogat

Vineshphogat

భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు.. కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి సమావేశం సర్వత్రా ఆసక్తిగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్నప్పుడే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు వినేష్ ఫోగట్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తు్న్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాట వేసింది. మొత్తానికి ఊహాగానాలకు తెరదించుతూ ఆమె బుధవారం రాహుల్‌గాంధీని కలిసింది. త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.

పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాములు తేడా రావడంతో వినేష్ ఫోగట్ ఫైనల్‌కు వెళ్లకుండా నిష్క్రమించింది. దీంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది. ఆమెకు భారతీయుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఇక రెజర్లకు స్వస్తి పలికి ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ-ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాల కోసం హస్తం పార్టీ వెతుకలాట ప్రారంభించినట్లు సమాచారం. రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాకు సీట్లు కేటాయించి విజయం సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీపై మాత్రం వినేష్ ఫోగట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 34 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా రెజర్లు భేటీ కావడంతో తుది జాబితాను బుధవారం సాయంత్రం కల్లా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అక్టోబర్ 5న పోలింగ్, 8న ఫలితాలు విడుదల కానున్నాయి.