అస్సాంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పన్నెండవ రోజు ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించనుంది. అయితే, రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం అస్సాంలోని గోలక్ గంజ్ నుంచి యాత్ర ప్రారంభించి కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా ధుబ్రి జిల్లాలోని హల్కురా గ్రామంలో ఆగిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరకు చేరుకుని టీ తాగారు.
Read Also: Panipuri: పానీపూరీ తిని ఇద్దరు చిన్నారులు మృతి!
ఇక, టీ దుకాణం యజమాని ఈ మొత్తం ఘటన సంబంధించిన విషయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ రాకను చూసి షాక్ అయ్యాను అని టీ స్టాల్ యాజమాని తెలిపారు. తన దుకాణంలోకి వచ్చి టీ తాగి, స్నాక్స్ తిని, ఇక్కడ ప్రసిద్ధి చెందిన పెరుగును రాహుల్ గాంధీ రుచి చూశారని దుకాణదారుడు చెప్పాడు. ఇక, ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించనుంది. కూచ్ బెహార్ నుంచి యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీ కూచ్ బెహార్లోనే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తన పశ్చిమ బెంగాల్ పర్యటన వ్యూహం ఏమిటి, ఈ సందర్భంగా ఎలాంటి అంశాలను లేవనెత్తారు అనే విషయాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు.