ఇరాన్ మాజీ సుప్రీం లీడర్, దివంగత నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోడీ గైర్హాజరవుతున్నారు. అంత్యక్రియల సమయంలో ముందస్తు విదేశీ పర్యటనలు ఉండడంతో మోడీ వెళ్లడం లేదు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలతో బిజీ షెడ్యూల్ ఉండటంతో మోడీ గైర్హాజరు కానున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రత్యేకంగా ప్రధాని మోడీని ఆహ్వానించినా.. బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాలేకపోతున్నారు. అయితే భారత్ నుంచి మోడీ తరపున ఇద్దరు ప్రతినిధులు హాజరుకాబోతున్నారు.
ఇద్దరు ప్రతినిధులు
భారత్ తరఫున బీహార్ గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా జూలై 4 నుంచి ప్రారంభమయ్యే అధికారిక అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. భారత ప్రభుత్వ ప్రతినిధులుగా ఇరాన్కు వెళ్లనున్నారు.
ఖమేనీ మరణం అనంతరం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఇటీవల జరిగిన 40 రోజుల ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తమ ఇరాన్ ప్రత్యర్థులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించారు. ఇటీవలే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా బ్రిక్స్ సమావేశాల కోసం భారత్కు వచ్చి జైశంకర్, ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. అలాగే ఇరాన్కు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఇటీవలి నెలల్లో భారత్ను సందర్శించడం ద్వారా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. చనిపోయి దాదాపు 100 రోజులకు పైగా అయింది. అయితే అంత్యక్రియల సమయంలో మళ్లీ దాడులు జరగవచ్చన్న సంకేతాలు నేపథ్యంలో ఇప్పుడు నిర్వహించలేదు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించాలని ఇరాన్ ప్రభుత్వం ఆలోచించింది. ఈ నేపథ్యంలో జూలై 4 నుంచి వారం రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 20 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల నుంచి అతిథులను ఇరాన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు. అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా మోడీ హాజరు కావడం లేదు. ఖమేనీ అంత్యక్రియలకు ఇరాక్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, రష్యా, చైనా, మధ్య ఆసియా దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు కూడా హాజరుకానున్నారు. 2024లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించినప్పుడు కూడా భారత్ తరఫున అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అధికారిక సంతాప కార్యక్రమాలకు హాజరయ్యారు.

