PM Modi: తెలంగాణ నుంచి దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కీలక సూచనలు చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలోని యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ చమురు సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో దేశం నుంచి విదేశీ మారక ధనం వెళ్లకుండా స్వదేశీ ఉత్పత్తులకు పెద్ద పీట వేయాలని కోరారు.
వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించుకుని మెట్రో వంటి పబ్లిక్ రవాణా వ్యవస్థల్ని వాడుకోవాలని సూచించారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటి దూరంగా ఉండాలని, ఒక ఏడాది పాటు బంగారొ కొనడం తగ్గించాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో ‘‘వర్క్ ఫ్రమ్ హోం’’కు అలవాటు పడ్డామని ప్రధాని గుర్తు చేశారు.
ఇదే కాకుండా రసాయన ఎరువుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వ్యవసాయంలో నేల సారాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. మధ్యతరగతి ప్రజలు దుబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చెప్పారు. ఇదే సమయంలో వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏమిటి.?
ప్రపంచ వ్యాప్తంగా ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాల కారణంగా ప్రపంచ సరఫరా గొలుసు దెబ్బతింది. ఇరాన్ యుద్ధ పరిణామాలు నేరుగా భారత్పై కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి దిగ్బంధం కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపుగా 70 డాలర్ల నుంచి 126 డాలర్ల వరకు బ్యారెల్ చమురు ధర చేరింది. అందుకే పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని కోరారు. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులైన చమురు, బంగారం, రసాయన ఎరువుల్ని మితంగా వాడాలని సూచిస్తున్నారు. దీని ద్వారా భారత విదేశీ మారక నిల్వల్ని కాపాడొచ్చు.
మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్..?
దాదాపుగా నాలుగేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మే 15 లోపు ధరలు పెరుగొచ్చనే వార్తల నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నందున, మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. సంబంధిత వర్గాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీలు నెలకు దాదాపుగా 30,000 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.
సంక్షోభ సమయంలో ప్రజల్ని కాపాడటానికి ప్రభుత్వం, చమురు కంపెనీలు పెట్రోల్పై లీటర్కు రూ. 24 , డీజిల్పై రూ. 30 భారాన్ని మోస్తున్నాయి. ఒకవేళ పెంపుకు కేంద్రం ఓకే చెబితే పెట్రోల్, డీజిల్పై లీటర్కు దాదాపు రూ. 4-5 పెరుగొచ్చు. సిలిండర్లపై రూ. 40-50 పెరుగొచ్చు. సంక్షోభాన్ని నివారించేందుకు యూరప్ దేశాలతో సహా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇంధన వినియోగంపై పరిమితి విధించాయి. శ్రీలంక పనిదినాలను తగ్గించింది. భారత్లో ఇప్పటి వరకు ఇలాంటి సమస్య రాలేదు, ఎలాంటి పరిమితి లేదు. రానున్న కాలంలో పరిస్థితులు చేజారిపోతే పెంపు ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు.
