Omar Abdullah: ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలు ప్రతిపక్షాలకే ఎదురుదెబ్బగా మారుతున్నాయని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. భారతదేశం పేదగా మారితే, బీజేపీ ధనవంతమైందని ఆరోపించారు. శనివారం ఇండియా టుడే కాన్క్లేవ్ 2024లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై వ్యతిగత దాడికి దిగిన ప్రతీసారి అది బూమరాంగ్ అవుతోందని అన్నారు.
ప్రధానిపై వ్యకిగత దాడి పనిచేయదని, ఇది పలు సందర్భాల్లో రుజువైందని ఒమర్ అబ్దుల్లా అన్నారు. గత అనుభవాలు కూడా ఇదే చెబుతోందని.. ‘‘చౌకీదార్ చోర్ హై’’, ‘‘ అదానీ-అంబానీ’’ పనికిరావని చెబుతోందని, మీకు నచ్చినా, నచ్చకపోయినా ఇది వాస్తవమని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి వద్ద డబ్బు ఉందని మీరు కేసు పెట్టలేరు, ఎందుకంటే దానిని నిరూపించడానికి ఆధారాలు లేవని, కానీ భారతదేశంలో చాలా భాగం పేదగా మారితే, బీజేపీ రిచ్ అయిందని, 50 శాతం ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకే ఇవ్వబడ్డాయని ఆయన అన్నారు.
Read Also: Telangana: హస్తం, కమలం పార్టీల మధ్యే పోటీ.. రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషీలు రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి వ్యూహాలపై చర్చించారు. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారత కూటమి పోటీ చేస్తుందని, గెలుస్తుందా..? లేదా..? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని సచిన్ పైలట్ అన్నారు. గత 9 ఏళ్లుగా దేశం చూసిన పరిస్థితుల కారణంగా ఇండియా కూటమి ముందుకు వచ్చిందని, దేశంలో సుస్థిరమైన రాజ్యాంగ సంస్థలపై ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతోందని, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎన్డీయేకు గట్టి పోటీ ఇవ్వడమే కూటమి లక్ష్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి, అంటే మూడింట రెండొంతులు మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారని ఆయన అన్నారు. ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ.. దేశం పెద్ద ప్రమాదంలో ఉందని అందుకే ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పారు.