Mohammed Shami: ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ సమయంలో, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి విమర్శలు వచ్చాయి. రంజాన్ మాసంలో షమీ ‘‘రోజా’’ పాటించకపోవడంపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ విమర్శలు గుప్పించారు. క్రికెట్ మ్యాచ్ సమయంలో ఉపవాసం ఉండకుండా నీరు, ఇతర డ్రింక్స్ తాగడాన్ని షాబుద్దీన్ తప్పుపట్టారు. షమీ ఒక ‘‘క్రిమినల్’’ అంటూ దుయ్యబట్టారు. అయితే, ఈ విషయంపై షమీకి మద్దతుగా యావత్ దేశం నిలబడింది.
Read Also: BJP MLA: “కేదార్నాథ్లో హిందువులు కాని వారిని నిషేధించాలి”.. మరో వివాదం..
ఇదిలా ఉంటే, ఇప్పుడు షమీ కూతురిని టార్గెట్ చేస్తూ షాబుద్దీన్ రజ్వీ విమర్శలు చేశారు. షమీ కూతురు హోలీ వేడుకల్లో పాల్గొనడాన్ని ‘‘చట్టవిరుద్ధం’’, ‘‘షరియత్కి విరుద్ధం’’ అని అభివర్ణించారు. శనివారం రాత్రి విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ..‘‘ ఆమె చిన్న అమ్మాయి, అర్థం చేసుకోకుండా హోలీ ఆడితే నేరం కాదు. ఆమెకు అన్నీ తెలిసి కూడా హోలీ ఆడుతుంటే అది షరియత్కి వ్యతిరేకంగా పరిగణించబడుతుంది’’ అని అన్నారు. ఇస్లాం సిద్ధాంతాలు పాటించాలని తాను షమీకి గతంలో సలహా ఇచ్చినట్లు షాబుద్దీన్ చెప్పుకొచ్చారు.
‘‘నేను షమీ మరియు అతని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశాను … షరియత్లో లేనిది మీ పిల్లలను చేయనివ్వకండి. హోలీ హిందువులకు చాలా పెద్ద పండుగ కానీ ముస్లింలు హోలీ జరుపుకోకూడదు. షరియత్ తెలిసిన తర్వాత కూడా ఎవరైనా హోలీ జరుపుకుంటే అది నేరం’’ అని అన్నారు. షరియత్ నియమాలు పాటించడం ముస్లింల అందరి బాధ్యత అని, ఇస్లాంలో ఉపవాసం తప్పనిసరి అని, ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే ఇస్లామిక్ చట్టాల ప్రకారం అతడిని పాపిగా పరిగణిస్తామని చెప్పారు. షమీతో సహా ఉపవాసం ఉండలేని వారు రంజాన్ తర్వాత ఉపవాసం ఉండాలని ఆయన సూచించారు.