Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టబోతున్న ‘భారత్ న్యాయ యాత్ర’పై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఓట్లను తీసుకురాదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన కుమారుడని, ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా జనాలు ఆయన్ని హీరోగా చూస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయరని బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. అస్సాంలోని బార్పేట జిల్లాలోని బగ్మారా చార్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Gyanvapi mosque case: నేడు జ్ఞాన్వాపీ మసీదులో సర్వే నివేదిక బహిర్గతంపై తుది తీర్పు
రాహుల్ గాంధీ దేశంలోని 50 శాతం ప్రాంతాల్లో పర్యటించారని, అది మంచి విషయమని అన్నారు. అయితే, ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి..? అని ప్రశ్నించారు. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ఒత్తిడిని సృష్టించడానికి మోడీ జీకి వేరే లైన్ లేదని, వారు కేజ్రీవాల్, హేమంత్ సొరెన్ వంటి వారిని జైలుకు పంపుతారని అన్నారు. ఇది ఇండియా కూటమికి ముప్పు అని.. ఆ కూటమి నాయకులు సైలెంట్గా ఉండకపోతే, ఈడీ ద్వారా ఒక్కొక్కరని అరెస్ట్ చేస్తారని, వారు వీలైనంత ఎక్కువ మందిని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.
భారత్ జోడో యాత్ర తర్వాత లోక్సభ ఎన్నికల ముందు మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ ‘భారత న్యాయ యాత్ర’ తలపెట్టారు. జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభమయ్యే యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది. 14 రాష్ట్రాలు, 85 జిల్లాలను కవర్ చేస్తుంది. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో యాత్ర జరుగుతుంది.