పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమై, ఆగస్టు 12 వరకూ కొనసాగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు తేదీలను ప్రతిపాదించినట్టు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుత పార్లమెంటు భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు కూడా ఇవేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొనడం తెలిసిందే.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు వర్షాకాల సమావేశాల సమయంలోనే ఎన్నికలు జరగనున్నాయి. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు ఉంటాయి. ఆగస్టు 10తో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ పదవీకాలం కూడా ముగుస్తుంది. దీంతో ఈ పదవికి కూడా వర్షాకాల సమావేశాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. కాగా, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో జరుగనున్న చివరి సమావేశాలు ఇవేనని తెలుస్తోంది.