పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ఎక్స్లో పేర్కొన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు పార్లమెంట్ 2026 వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దేశ ప్రాధాన్యత కలిగిన కీలక అంశాలపై అర్థవంతమైన చర్చలు, సమగ్ర చర్చోపచర్చలు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశాలు వేదిక కానున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇక ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముండగా దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, ఇతర సమకాలీన అంశాలపై కూడా ఇరు సభల్లో విస్తృతంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా వివిధ ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే అవకాశముంది.
ఇటీవలి పరిణామాలు, దేశీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను కూడా ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశాల్లో ప్రస్తావించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా తన కీలక విధానాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను సభ ముందుకు తీసుకురానుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ముగియనున్న ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు, చర్చలు జరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కీలక బిల్లులు
వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన)ను సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లులో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల సభ్యుల సంఖ్యను 50 శాతం పెంచే ప్రతిపాదన కూడా ఉండొచ్చని సమాచారం.
ప్రతిపక్షం వ్యూహం
ఇక ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య వంటి అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్ హాట్గా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Monsoon session 2026 of the Parliament to be held from 20th July to 13th August. pic.twitter.com/AhxNRQzAXe
— ANI (@ANI) July 4, 2026

