Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం పాకిస్తాన్ని కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు, భారత్ సైనిక చర్యకు దిగవచ్చనే భయం ఆ దేశంలో ఉంది. బయటకు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ పాక్ ఆర్థిక పరిస్థితి, అంతర్గత సమస్యలు, ఆర్మీలో గ్రూపులు అన్ని కూడా ఆ దేశానికి ప్రతీకూలంగానే ఉన్నాయి.
Read Also: Mani Shankar Aiyar: ‘‘పాకిస్తాన్పై కాంగ్రెస్ ప్రేమ’’.. మణిశంకర్ అయ్యర్ కామెంట్స్పై బీజేపీ..
మంగళవారం జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. పాకిస్తాన్కు చెందిన నిషేధిత గ్రూప్ లష్కరే తోయిబా (LeT) ప్రతినిధి అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. అయితే, పాకిస్తాన్ ఘర్షణను తగ్గించేందుకు రష్యా, చైనా సాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ రష్యా మీడియా ఆర్ఐఏ నోవోస్టికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనాలు ఈ సమయంలో సానుకూల పాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. భారత్ దేశం, మోడీ అబద్ధం చెబుతున్నారా..? లేదా నిజం చెబుతున్నారా.? అని నిర్ధారించడానికి వారు అంతర్జాతీయ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయవచ్చని అన్నారు. అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని కూడా అంతర్జాతీయ దర్యాప్తుకు పిలుపునిచ్చారు.
“భారతదేశంలో, కాశ్మీర్లో జరిగిన ఈ సంఘటనకు దోషిని మనం గుర్తించాలి. ఖాళీ ప్రకటనలకు ఎటువంటి ప్రభావం ఉండదు, పాకిస్తాన్ ప్రమేయం ఉందా అనేదానిపై ఆధారాలు ఉండాలి. ఇవి కేవలం ఆధారం లేని ప్రకటనలు” అని అన్నారు. దీనికి ముందు, పహల్గామ్ దాడిని స్వాతంత్ర్య యోధులు చేశారని పాక్ ఉపప్రధాని ఇషాక్ దార్ అన్నారు.