Shehbaz Sharif: ‘‘భారత్‌ని ఓడించకపోతే నా పేరు షెహాబాజ్ షరీఫ్ కాదు’’.. పాక్ ప్రధాని పేరు మార్పు తప్పదేమో..

  • భారత్ గురించి పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రగల్భాలు..
  • ఇండియాను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని సవాల్..
Shehbaz Sharif

Shehbaz Sharif

Shehbaz Sharif: తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదం, ఉగ్రవాదం, మతఛాందసవాదంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పెద్దపెద్ద సవాళ్లు చేస్తోంది. ఏ దశలోనూ భారత్‌తో పోలిక లేదు, అయినా భారత్‌ని ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. తినడానికి తిండి లేకపోయినా, కింద కోట్ల అప్పులు ఉన్నా కూడా వాస్తవాలను మరిచి ప్రవర్తించడం పాకిస్తాన్‌కే చెల్లుతోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహజాబ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.

Read Also: Mahindra: స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!

పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ పేరు మార్చుకునే అవకాశం ఉంది. ఆయన పంజాబ్ ప్రావిన్స్ లోని డేరా ఘాజీఖాన్‌ని ఇటీవల సందర్శించిన సమయంలో, ఒక బహిరంగ సభలో చాలా ఉత్సాహంగా కనిపించారు. అక్కడ ఉన్న జనాలను చూసి వాస్తవాలను మరిచిపోయి పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ‘‘ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్‌ని ఓడించకపోతే తన పేరు షెహజాబ్ షరీఫ్ కాదు’’ అని సవాల్ విసిరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అప్పుల నుంచి బయటపడటమే కష్టం, అలాంటిది ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ని దాటడం అంటే పాక్‌కి అసాధ్యం. దీంతో ఆయన పేరు మార్చుకోవడం పక్కా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఆయన మాటల్ని సొంత దేశ ప్రజలు కూడా నమ్మడం లేదు.

ఇదే కాకుండా.. సామాన్యుల అవసరాలను తీర్చడానికి తన ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రజలకు హామీ ఇస్తూ, “పాకిస్తాన్‌లో పరిస్థితి మెరుగుపడటానికి మేము పగలు మరియు రాత్రి పని చేస్తాము. సర్వశక్తిమంతుడు ఎల్లప్పుడూ పాకిస్తాన్‌ను ఆశీర్వదించాడు” అని షరీఫ్ అన్నారు. తన అన్నయ్య, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చూపిన మార్గంలో పయనిస్తున్నానని చెప్పారు. పాకిస్తాన్‌ని గొప్పగా తీర్చదిద్దడానికి, భారత్‌ని ఓడించడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ ప్రగల్భాలు పలికిన రెండు వారాలకే, భారత్ తమతో చర్చలు ప్రారంభించాలని వేడుకోవడం షెహజాబ్‌కే చెల్లింది.