Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడితో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాది దేశానికి భారత్ తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పీవోకేలో గల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తుంది. వారిని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించినట్లు సమాచారం. భారత భద్రతా దళాలు క్రియాశీలకంగా ఉన్న పలు లాంచ్ ప్యాడ్లను గుర్తించడంతో పాక్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Read Also: Ready to War: యుద్ధానికి సిద్ధమా..? ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవా..?
అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కేల్, సర్ది, దుధ్నియల్, అత్ముఖం, జురా, లిపా, కొట్లి లాంటి పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరలిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడటానికి ముందు వారు నివసించే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్ ప్యాడ్స్ పని చేస్తాయని పేర్కొన్నారు. వీటిలో 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన టెర్రరిస్టులు ఉన్నారని, వారంతా చొరబాటుకు రెడీగా ఉన్నారని వెల్లడించారు.
Read Also: Pahalgam Terror Attack: రోడ్లపై పాకిస్థాన్ జెండాలు అతికించిన వ్యక్తులు.. పోలీసులు ఏం చేశారంటే?
ఇక, పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టులపై ఉగ్ర దాడిలో26 మంది చనిపోయారు. ఈ సంఘటనతో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్తో దౌత్య సంబంధాలను ఇప్పటికే భారత్ రద్దు చేసుకుంది. అలాగే, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు దాయాది దేశానికి చెందిన పౌరులు తక్షణమే భారత్ వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. మరోవైపు, సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన బెడుతున్నట్లు పాక్ ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణమైన యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.