Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. మొత్తం 09 లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, భారతదేశం ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత 30 నిమిషాల్లోనే పాకిస్తాన్ అప్రమత్తమైందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి తెలియజేసినట్లు తెలిసింది. మే 07 రాత్రి ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
‘‘ ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన అరగంటలోపు, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పాకిస్తాన్కి సమాచారం ఇచ్చాం. భారతదేశం, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆప్ మిలిటరీ ఆపరేషన్స్(DGMOలు) మధ్య ప్రత్యక్ష సంభాషణ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ముందుగా పాకిస్తాన్ ఈ ప్రతిపాదన చేసింది’’ అని జైశంకర్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఆపరేషన్ సిందూర్ మరియు పాకిస్తాన్ నుండి ఉద్భవించే సీమాంతర ఉగ్రవాదం గురించి చర్చించడానికి ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించిన విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కెసి వేణుగోపాల్, మనీష్ తివారీ, ముకుల్ వాస్నిక్, ప్రియాంక చతుర్వేది, అప్రజిత సారంగి, గుర్జిత్ ఆజ్లా వంటి ఎంపీలు పాల్గొన్నారు. భారతదేశం ఖచ్చితత్వంతో వ్యవహరించిందని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండటానికి పాకిస్తాన్కు వెంటనే ఈ విషయాన్ని తెలియజేసిందని జైశంకర్ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా విదేశాంగ కార్యదర్శి నిఘా వర్గాలకు సమాచారం అందించినప్పుడు భారత్ తీవ్రంగా స్పందించిందని జైశంకర్ చెప్పారు.