Operation Sindoor: భారత్ పాకిస్తాన్ మధ్య గతేడాది మే నెలలో జరిగిన యుద్ధం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కేవలం 88 గంటల్లోనే పాకిస్తాన్ను భారత్ కాళ్ల బేరానికి తెచ్చింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. పాక్, పీఓకేలోని లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడితే, భారత వాయు సేన ఏకంగా పాక్ వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఏకంగా 10కి పైగా పాక్ ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి.
Read Also: Former ICC Chairman Ehsan Mani: “మాట్లాడండి.. బయపెట్టకండి”.. అలా ఐతే భారత్-పాక్ మ్యాచ్ కష్టమే!
ఇదిలా ఉంటే, భారత్ చేసిన దాడుల తర్వాత ఇప్పటికీ పాకిస్తాన్ రిపేర్లు చేయించుకుంటుంది. పాక్ భోలారి ఎయిర్బేస్ పునర్నిర్మాణం ప్రారంభమైందని శాటిలైట్ ఇమేజ్లు చూపిస్తున్నాయి. 2025 మే 10న ఉదయం 10-12 గంటల మధ్యలో భారత్ ఎయిర్ ఫోర్స్ భోలారి ఎయిర్ బేస్పై మిస్సైల్ అటాక్ చేసింది. పాకిస్తాన్కు ఎంతో కీలకమైన SAAB 2000 ‘Erieye’ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానం ఈ దాడిలో ధ్వంసమైనట్లు తెలుస్తోంది. భోలారి హ్యాంగర్ పూర్తిగా దెబ్బతింది. మురీడ్, సుక్కూర్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లు కూడా భారత దాడిలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలో ఉండటం గమనార్హం.
మే 9 రాత్రి మొదలైన దాడుల్లో భారత వాయుసేన కనీసం 10 ప్రధాన పాక్ ఎయిర్ బేసుల్ని లక్ష్యంగా చేసుకుంది. రాఫెల్ యుద్ధవిమానాల నుంచి స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడింది. సుఖోయ్ 30 MKI నుంచి ఇజ్రాయెల్ రాంపేజ్ క్షిపణులను ఉపయోగించింది. మిరేజ్-2000 నుంచి క్రిస్టల్ మేజ్ క్షిపణులు, సుఖోయ్ ద్వారా బ్రహ్మోస్ ఎయిర్ టూ సర్పెస్ క్షిపణులను ప్రయోగించి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. నూర్ ఖాన్, చక్లాలా, రఫికీ, రహీం యార్ ఖాన్, సుక్కూర్, మురీడ్, నయాచోర్ ఇలా పలు ఎయిర్ బేసులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.