Supreme Court:కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. సీఏఏపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు 3 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏప్రిల్ 8వ తేదీలోగా తన స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని సుప్రీం కోరింది. ఏప్రిల్ 9న విచారణ జరపనుంది.
సీఏఏని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 237 పిటిషన్లు దాఖలయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్లలో ప్రధానంగా కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీడ్ (IUML), మరియు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI), కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, తృణమూల్ నాయకుడు మహువా మొయిత్రా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీలు ఉన్నారు. ముస్లిం సమాజంపై ఇది వివక్ష అని వారంతా పిటిషన్లలో పేర్కొన్నారు.
Read Also: Ananya Panday: నిషా కళ్ళతో కలవరపరుస్తున్న అనన్య పండే అందాలు …
2019లో పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు కూడా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఆ సమయంలో నిబంధనలు నోటిఫై కాకపోవడంతో సుప్రీం కోర్టు వీటిని విచారించలేదు. తాజాగా మార్చి 11న ఈ చట్టానికి సంబంధించిన నిబంధనల్ని కేంద్రం నోటిఫై చేసింది. ఈ చట్టం ప్రకారం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి మతపరమైన హింస నుండి పారిపోయి వచ్చిన ముస్లిమేతర హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ లేదా క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారు CAA ప్రకారం పౌరసత్వం పొందేందుకు అర్హులు.