కోవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాల్లోని మూడు కేంద్రాల్లో ఉచిత కోవాగ్జిన్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టీకాకరణ కార్యక్రమం ప్రజాఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని… టీకానంతరం కూడా జాగ్రత్తలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలి, ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమష్టికృషితో కరోనా మహమ్మారిపై పోరాటంలో మనం ముందంజలో ఉన్నాం, ఇకపైనా ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దామన్నారు.