దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈరోజు కూడా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాల్లో కూడా వణికిస్తోంది. గ్రామాల్లోని ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రుల వద్ద పెద్ద సంఖ్యలో కరోనా రోగులు కనిపిస్తున్నారు.
అయితే, గుజరాత్ లోని మోహ్సహా జిల్లాలోని బేచరాజీ మండలంలో చాందిని అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. గ్రామంలో పెద్దవాళ్ళు, వృద్దులు నివసిస్తున్నారు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గ్రామంలోని ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించడమే ఇందుకు కారణం అని చెప్తున్నారు. మాస్క్ ను ఎలా ధరించాలో అలా ధరిస్తున్నారు. బయటి నుంచి ఎవర్ని గ్రామంలోకి రానివ్వడం లేదు. ఇంట్లో నుంచి ఎవరూ కూడా బయటకు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నారు. దీంతో గ్రామంలోకి కరోనా మహమ్మారి ఎంటర్ కాలేదని చాందిని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.