CM Nitish Kumar: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్లో ఈ అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. నితీష్ కుమార్ ఢిల్లీ రాజకీయాల్లోకి వస్తే బీహార్ సీఎం పీఠం ఖాళీ అవుతుంది. దీంతో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఆసక్తికరంగా మారింది. నితీష్ కుమార్ రాజ్యసభ పేపర్స్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, నితీష్ రాజ్యసభకు వెళ్లగానే ఆయన కుమారుడు నిషాంత్ను డిప్యూటీ సీఎంగా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మార్చి 16 తర్వాత నితీష్ రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.
Read Also: Telangana: రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ..
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తన సొంత పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయవచ్చని తెలుస్తోంది. 2026 రాజ్యసభ ఎన్నికల మధ్య ఈ వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం జేడీయూ, బీజేపీ అగ్రనాయకత్వాలు వారసత్వ ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆలోచిస్తున్నాయి. కేంద్రంలోని ఏన్డీయే కూటమి నితీష్ కుమార్కు ప్రధాన బాధ్యత అప్పగిస్తారని వినికిడి. ప్రస్తుతం, బీహార్ సంకీర్ణంలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 89, జేడీయూకు 85 సీట్లు ఉన్నాయి. మొత్తంగా ఎన్డీయే కూటమికి 202 స్థానాలు వచ్చాయి. ఈ కూటమిలో బీజేపీ, జేడీయూలు కాకుండా చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 19, HAM-Sకు 5 సీట్లు, RLMకు 4 సీట్లు ఉన్నాయి.