Site icon NTV Telugu

Nirmala Sitharaman: భారతీయ ఉత్పత్తులకు శుభవార్త.. భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై నిర్మలమ్మ వ్యాఖ్య

Nirmala Sitharaman

Nirmala Sitharaman

భారత్-అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం మోడీ-ట్రంప్ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. అనంతరం భారత్‌పై 18 శాతానికి సుంకం తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడ్డాయి. అంతేకాకుండా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థకు దోహదపడనుంది.

ఈ నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం మధ్య సుంకాల తగ్గింపును ప్రశంసించారు. ‘‘భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులకు శుభవార్త’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘#MadeInIndia ఉత్పత్తులకు శుభవార్త. అవి ఇప్పుడు 18 శాతానికి తగ్గిన సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. PM @narendramodi, @POTUS నాయకత్వానికి ధన్యవాదాలు. ఈ అభివృద్ధి కోసం. మన రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల ప్రజలు ప్రయోజనం పొందుతారు.’’ అని నిర్మలా సీతారామన్ రాసుకొచ్చారు.

సోమవారం రాత్రి ట్రంప్-మోడీ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణతో తిరిగి భారత్-అమెరికా మధ్య బంధాలు బలపడ్డాయి. ఇద్దరి నేతల మధ్య జరిగిన ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్‌పై 18 శాతం సుంకం తగ్గించినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. రష్యా చమురు నిలిపివేతకు భారత్ అంగీకరించిందని.. ఇక భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు ఉండబోవని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య ఒప్పందాలు జరిగినట్లుగా పేర్కొన్నారు. మోడీ గొప్ప స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇండియా టుడే మ్యాగజైన్ కవర్‌పై ఉన్న ట్రంప్-మోడీ ఫొటోను పోస్ట్ చేశారు.

ఇక భారత్‌పై 18 శాతం సుంకాలు తగ్గించినట్లుగా ట్రంప్ ప్రకటన రాగానే ప్రధాని మోడీ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియమైన స్నేహితుడు ట్రంప్‌తో ఈరోజు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు ఇప్పుడు 18 శాతానికి తగ్గించబడిందని తెలుసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాలు కలిసి పని చేసినప్పుడు ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలను తెరుస్తుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం చాలా కీలకం. శాంతి కోసం ట్రంప్ చేసే ప్రతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని అపూర్వమైన శిఖరాలకు తీసుకెళ్లడానికి ట్రంప్‌తో కలసి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.’’ అంటూ మోడీ రాసుకొచ్చారు.

Exit mobile version