Nirmala Sitaraman on Crypto Currency: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోకరెన్సీ కోసం నిబంధనలను రూపొందించాలని, వాటిని నిషేధించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వాన్ని కోరిందని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క్రిప్టో కరెన్సీని నిషేధించడం కుదరదని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఇతర దేశాల సహకారం ఉంటేనే క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయగలమని ఆమె తెలిపారు. లేదంటే క్రిప్టో కరెన్సీపై ఎలాంటి పైచేయి సాధించలేమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Read Also: Har ghar Tiranga: ఇంటింటా మువ్వన్నెల జెండా.. దేశభక్తి గుండెల నిండా..
క్రిప్టోకరెన్సీపై లోక్సభలో ఎంపీ తిరుమావళవన్థోల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే క్రిప్టోకరెన్సీల ప్రభావం తగ్గించాలని.. దీనిపై చట్టం చేయాలని ఆర్బీఐ గతంలో సిఫారసు చేసిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ మాట్లాడుతూ.. క్రిప్టోకరెన్సీలను నిషేధించడం భారతదేశానికి అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ బలపడాలంటే క్రిప్టో కరెన్సీలను నిషేధించాల్సిన అవసరముందన్నారు.