Kerala: ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి చూపించుకుంటాము. ఆసుపత్రికి వెళ్లగానే చికిత్స చేసే ముందు వైద్యులు గానీ, లేదా నర్సులు గానీ ఏమైందని అడుగుతారు.. రోగి చెప్పే దాన్నిబట్టి రోగికి చికిత్సను అందిస్తారు. అయితే ఒక్కోసారి ఏమరుపాటుతో డాక్టర్లు రోగికి సంబంధించిన రోగానికి కాకుండా ఇతర చికిత్సలను చేస్తుంటారు. ఇటువంటివి అరుదుగా జరుగుతుంటాయి.. కొన్నిసందర్భాల్లో నిర్లక్ష్యంతోనూ జరుగుతుంటాయి. కేరళలోనూ అలాగే నర్సు నిర్లక్ష్యంగా వ్యవహారించింది. దీంతో చిన్నారికి సీరియస్ అయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
Read also: K.Bhagyaraj 3.6.9 Movie: గంటన్నరలోపే సినిమా పూర్తి… విడుదలయ్యేది ఎప్పుడంటే?
కేరళలోని కొచ్చి సమీపంలోని అంగమాలిలోని తాలూకా ఆసుపత్రికి ఆగస్టు 11న జ్వరంతో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి చేరుకున్న తరువాత.. డాక్టర్ పరీక్షించి.. రక్త పరీక్షలు చేయాలని సూచించారు. దీంతో చిన్నారి బంధువులు ఆస్పత్రిలోనే ఏర్పాటు చేసిన ల్యాబ్కు చేరుకుని చిన్నారిని ఆరుబయట కూర్చోబెట్టి బిల్లు చెల్లించడం వెళ్లారు. కొద్దిసేపటికే ఒక నర్సు వచ్చి ఆ చిన్నారి వివరాలను పూర్తిగా తెలుసుకోకుండానే ఆ చిన్నారికి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చింది. అప్పటికి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఇంజక్షన్ గురించి అడగగా.. సమాధానం విని షాక్ అయ్యారు. కుక్క, పిల్లి, కోతి తదితర జంతువులు కరిచిన వారికి వేసే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ను చిన్నారికి వేసినట్టు గుర్తించారు. నర్సు నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిన్నారి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ విషయమై తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా.. రేబిస్ వ్యాక్సిన్ వేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నర్సుపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిని అబ్జర్వేషన్లో ఉంచామని, చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య తలెత్తలేదని వైద్యులు తెలిపారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ.. హాస్పిటల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న నర్సు సర్వీస్ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.