ఇటీవల కాలంలో దేశంలో వరుసగా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు హ్యాకర్ల బారిన పడుతున్నాయి. తాజాగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ శనివారం అర్ధరాత్రి హ్యాకింగ్కు గురైంది. దీంతో సాంకేతిక నిపుణులు ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. దేశంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే సాయం చేయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తోంది. ఈ నెల 19నే ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.
Read Also: తెలంగాణకు కేంద్రం శుభవార్త.. మరో 4 జాతీయ రహదారులు మంజూరు
దేశంలో ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్కు గురయ్యాయి. ఇటీవల కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి ఎలాన్ మస్క్గా పేరు మార్చి 50కి పైగా వరుస ట్వీట్లు చేశారు. హరీ అప్, అమేజింగ్ అంటూ రాసి వాటి కింద టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫోటోతో హైపర్ లింక్లు పోస్టు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. మరోవైపు గత నెల డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకర్ల బారిన పడిన విషయం తెలిసిందే.