Muhammad Yunus: బంగ్లాదేశ్లో రాడికల్ శక్తులకు సహాయం చేయడం, మైనారిటీలను రక్షించడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న బంగ్లా తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ దిగిపోతూ భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 2024లో హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత యూనస్ అధికారం చేపట్టి బంగ్లాలో భారత వ్యతిరేకతను పెంచి పోషించాడు.
తాజాగా ఆయన చేసిన ప్రసంగంలో భారత్పై తన వ్యతిరేకతను వెల్లడించారు. విదేశాంగ విధానంలో బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, గౌరవం, స్వాతంత్య్రాన్ని తిరిగి పొందిందని, ఇకపై ఇతన దేశాల ఆదేశాలపై పనిచేయదని చెప్పారు. భారత్ను లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు. భూటాన్, నేపాల్, ‘‘సెవెన్ సిస్టర్స్’’తో బంగ్లాదేశ్ అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. భారతదేశంలోని అంతర్భాగమైన 7 ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Reels Madness: శివుడికి గంజాయి ప్రసాదం.. యువకుల వికృత చేష్టలు.. రంగంలోకి సీపీ సజ్జనార్..
తన హయాంలో చైనా, జపాన్, యూఎస్ఏ, యూరప్తో బంగ్లా సంబంధాలను పెంచానని, భారతదేశ వ్యూహాత్మక ‘‘సిలిగురి కారిడార్’’కు సమీపంలోని తీస్తా నదిపై చైనా సహాయంతో ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు. ఇదే కాకుండా బంగ్లాదేశ్ సైన్యాన్ని విదేశాల దురాక్రమణను ఎదుర్కోవడానికి బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ఇది భారత్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యగా పరిగణిస్తున్నారు.
తాజాగా జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సంచలన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్, బంగ్లాదేశ్ ప్రధానిగా ఫిబ్రవరి 17న ప్రమాణస్వీకారం చేశారు. అయితే, దిగిపోతూ కూడా యూనస్ తన భారత వ్యతిరేకతను దాచుకోలేదు. పరోక్షంగా భారత్తో బంగ్లా సంబంధాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు.