కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్… 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన దేశాన్ని అత్యుత్తమంగా, సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దాలని, మనం ఇతరులపై ముందుగా దాడి చేయకపోయినా, మనపై కన్ను వేసినవారికి దీటైన జవాబు ఇచ్చేవిధంగా అభివృద్ధి చేయాలన్నారు.. 2047లో మన దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుంది.. 2047నాటికి ఎలాంటి భారత దేశాన్ని మనం నిర్మించాలని ప్రశ్నించిన రక్షణ మంత్రి… ఒకే భారత దేశం, శ్రేష్ఠమైన భారత దేశంగా ఎదగాలన్నారు. సౌభాగ్యవంతమైన, స్వయం సమృద్ధి సాధించిన, ఆత్మ గౌరవంగల దేశంగా భారత్ను తీర్చిదిద్దాలని తెలిపారు.
ఇక, 75 ఏళ్లకు పూర్వం స్వాతంత్ర్య సమర యోధులు అవసరం అయినప్పుడు పర్వతాల్లో ఆశ్రయం పొందేవారని గుర్తుచేశారు రాజ్నాథ్ సింగ్.. ఇప్పుడు మన దేశం అవే పర్వతాలపై మౌంటెయిన్ కాంపెయిన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 15న 100 దీవుల్లో జాతీయ జెండాను ఎవరవేయనుంది..