Site icon NTV Telugu

UP: కుటుంబం ఆత్మహత్య కేసులో వెలుగులోకి సంచలన వీడియో.. అసలు మిస్టరీ ఇదే..!

Upcase1

Upcase1

ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్‌పూర్ గ్రామంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయి ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యభర్తలు, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. మనీష్ (35), అతని భార్య సీమ (32), ఐదేళ్ల కుమార్తె హానీ, నాలుగేళ్ల ప్రియాంషి, రెండేళ్ల కుమారుడు పంకజ్ శవాలుగా పడి ఉన్నారు. ఉదయాన్నే పిల్లలు ఆడుకోవడానికి రాకపోవడంతో స్థానికులు గమనించి లోపలికి వెళ్లచూడగా బయటపడింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి తరలించారు.

తాజాగా పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టారు. గోడలపై ఉన్న రాతలు, ఆత్మహత్యకు ముందు మొబైల్‌లో మనీష్ వీడియో రికార్డ్ చేశాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదని.. స్వచ్ఛందంగా తమ ప్రాణాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తమ మరణానికి ఎవరు బాధ్యలు కారని.. ఎవరిని నిందించొద్దని కోరాడు. అలాగే తమకు ఎలాంటి అప్పులు లేవని.. ఎవరూ తమను డబ్బు అడగలేదని చెప్పాడు. వీడియోలో ఉన్నట్లుగానే గోడలపై కూడా రాతలు ఉన్నాయి.

ఇక పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం.. పిల్లలకు పాల్లో విషమిచ్చి చంపగా.. భార్యను రోకలి బండతో మనీష్ కొట్టి చంపి.. అనంతరం విద్యుత్ షాక్‌తో ప్రాణాలు తీసుకున్నట్లుగా వెల్లడైంది. అయితే సూసైడ్ నోట్, చనిపోయిన విధానం చూసి పోలీసులకు అనుమానం వచ్చింది. ఏదో తేడాగా ఉందని కూపీలాగితే.. కుటుంబం ఆత్మహత్య వెనుక ఒక మంత్రగత్తె ఉన్నట్లుగా పోలీసులు కనిపెట్టారు. ఆమెతో ఉన్న సంబంధంతోనే ఈ మరణాలు సంభవించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఇటీవలే ఒక భూమిని 1.2 మిలియన్లకు మనీష్ అమ్మినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ డబ్బును ఏం చేశారన్నది తేలాల్సి ఉంది. అయితే మనీష్ ఎవరితోనూ పంచుకోలేని సమస్యలతో బాధపడుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

2018లో పెళ్లైనట్లుగా మనీష్ స్నేహితుడు చెప్పాడు. రెండేళ్ల నుంచి తాంత్రికుడితో ఎక్కువగా గడుపుతూ క్షుద్రపూజలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా మూఢనమ్మకాలనే నమ్ముతున్నాడని.. చివరికి అదే కుటుంబాన్ని బలి తీసుకుందని వాపోయాడు.

ఇక ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి సాధ్యమైనంత సహాయం అందించాలని సూచించారు. ఇది సమాజానికి ఆందోళన కలిగించే అంశం అని జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర ప్రకాష్ సింగ్ అన్నారు.

Exit mobile version