కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహం పేరుతో భార్యలపై భర్తలు లైంగిక దాడులకు పాల్పడటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకకు చెందిన ఒక మహిళ తన భర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె ముందే భర్త లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం కోర్టు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా భర్త కూడా మనిషేనని.. మనిషి లైంగిక దాడి ఎక్కడ చేసినా అది నేరమేనని.. భార్యపై భర్త లైంగిక దాడి చేయడం కూడా అత్యాచారంతో సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం పేరుతో కొంతమంది పురుషులు తమ భార్యలపై వికృత చేష్టలకు పాల్పడటం అనాగరికమైనదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాహం అనేది లైంగిక దాడులకు లైసెన్స్ కాదని… పెళ్లి చేసుకున్నంత మాత్రాన మహిళలు తమకు బానిసలుగా భావిస్తున్న పురుషులు క్రూరమైన చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికింది.
రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు పురుషులు, మహిళలు ఇద్దరూ సమానమేనని తెలిపింది. భార్య తక్కువ.. భర్త ఎక్కువ అంటే కుదరదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 37 అనేది వివాహంలో లైంగిక కార్యకలాపాలను మినహాయించింది. దీంతో భార్యపై అత్యాచారం నేరానికి సంబంధించిన విచారణ నుంచి భర్తకు ఇది మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ను తాము పరిగణలోకి తీసుకోలేదని కర్ణాటక హైకోర్టు తెలిపింది.
